HomeTelanganaఆర్టీసీ సమ్మె మరింత ఉదృతం.. ఆరు రోజుల ఉద్యమ కార్యాచరణ

ఆర్టీసీ సమ్మె మరింత ఉదృతం.. ఆరు రోజుల ఉద్యమ కార్యాచరణ

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణ ఉదంతంపై తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే డ్రైవర్ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. భవిష్యత్ పోరాట దిశను ఖరారు చేసేందుకు జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ ధోరణిని ఎండగడుతూ ఆరు రోజుల భారీ నిరసన కార్యాచరణను ప్రకటించింది.

నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకోవడం ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డెబ్బై శాతం కాలిన గాయాలతో ఆయన ప్రస్తుతం వరంగల్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఈ ఘటనకు ప్రేరణ అని కార్మిక నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలను పక్కన పెట్టారని జేఏసీ విమర్శించింది. ఇప్పటికే 29 డిమాండ్లు పరిష్కరించామన్న మంత్రి మాటలు అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రభుత్వ వైఖరితో మనస్తాపం చెందిన కార్మికులు ఆత్మబలిదానాలకు పాల్పడటం దురదృష్టకరమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 34 మంది కార్మికులు బలి కావడాన్ని జేఏసీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడం సరికాదని హితవు పలికింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించి సమ్మె వాతావరణాన్ని విరమింపజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శాంతియుత మార్గంలో నిరసనలు తెలియజేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసన కార్యక్రమాలకు జేఏసీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అన్ని డిపోలు రీజియన్ కార్యాలయాల వద్ద కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరింది. ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. మహిళా కార్మికులు సైతం బతుకమ్మలతో నిరసనలో భాగస్వాములు కానున్నారు. ఆర్టీసీ మనుగడ కోసం కార్మికుల ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు.

ఆరు రోజుల వివరాలివే..

ఏప్రిల్ 24: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు మౌన ప్రదర్శనలు నిర్వహిస్తారు.

ఏప్రిల్ 25: డిపోల ప్రాంగణాల్లో కార్మికులు సామూహికంగా వంటావార్పు కార్యక్రమం చేపడతారు.

ఏప్రిల్ 26: అన్ని జిల్లాల కేంద్రాల్లో రీజియన్ కార్యాలయాల వద్ద భారీ స్థాయిలో కార్మిక కవాతు జరుగుతుంది.

ఏప్రిల్ 27: రాష్ట్రంలోని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలిసి వినతి పత్రాలు అందజేస్తారు.

ఏప్రిల్ 28: మహిళా ఉద్యోగులంతా ఏకమై అన్ని డిపోల వద్ద బతుకమ్మలతో నిరసన ప్రదర్శనలు చేస్తారు.

ఏప్రిల్ 29: ఉద్యమ ముగింపులో భాగంగా అన్ని డిపోల ముందు కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలు చేపట్టి తమ నిరసన తెలియజేస్తారు.

ALSO READ: Travel: వైరల్ అవుతున్న రోడ్‌ మ్యాప్.. కాలినడకన భారత్ నుండి అమెరికాకు?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments