HomeTelanganaరాష్ట్రవ్యాప్తంగా హెల్త్ వీక్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ వీక్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11, 2026 వరకు “హెల్త్ వీక్” నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాల నిర్వహణపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ వీడియో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, ప్రభుత్వ వైద్య సేవలపై విశ్వాసం పెంచడం, ప్రతి వర్గానికీ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి ఆదేశించారు.

ఈ హెల్త్ వీక్‌లో ప్రతి రోజును ప్రత్యేక అంశంతో నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ఏప్రిల్ 6న ఆహార భద్రతపై దృష్టి సారిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్ వద్ద ఉదయం నిర్వహించే ఈట్ రైట్ వాక్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన కల్పించనున్నారు. మధ్యాహ్నం నేచురోపతి ఆసుపత్రిలో మిల్లెట్ మేళా నిర్వహించి, ఆహార పదార్థాల నాణ్యతపై చర్చలు జరపనున్నారు. ఫుడ్ హ్యాండ్లర్లకు శిక్షణ ఇవ్వడం, వీధి ఆహార విక్రేతలకు సర్టిఫికేట్లు అందించడం, పరిశుభ్రత ప్రమాణాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాల స్థాయిలో కూడా ఆహార భద్రతపై ప్రత్యేక మేళాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిమ్స్‌లో అత్యాధునిక లినాక్ యంత్రాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో తెలంగాణ కేన్సర్ రిజిస్ట్రీ, ట్రామా కేర్ విధానం, పలు సేవా వేదికలను ప్రారంభించనున్నారు. అదే కార్యక్రమంలో 871 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన వైద్యులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. తరువాత ఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని ప్రారంభించి వైద్య రంగంలో మరో ముందడుగు వేయనున్నారు.

ఏప్రిల్ 8న సురక్షిత మాతృత్వంపై దృష్టి సారిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బోయిగూడలోని మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రధాన కార్యక్రమం జరగనుంది. జిల్లాల వ్యాప్తంగా గర్భిణీలకు అవసరమైన పరీక్షలు, హై రిస్క్ కేసుల గుర్తింపు, ప్రసూతి సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్యకరమైన తల్లి, శిశు సంరక్షణపై ప్రజలకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించనున్నారు.

ఏప్రిల్ 9న ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నారు. రెడ్ రన్ నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచనున్నారు. జిల్లాల స్థాయిలో ర్యాలీలు, జైళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు, ట్రాన్స్‌జెండర్ వర్గాల కోసం ఉచిత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, పరీక్షలు చేయించుకోవాలనే చైతన్యం పెంచడమే లక్ష్యంగా ఉంది.

ఏప్రిల్ 10న హోమియోపతి, ఆయుష్ సేవలను ప్రోత్సహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హోమియోపతి కళాశాలలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి, ప్రత్యామ్నాయ వైద్య విధానాల ప్రాధాన్యంపై చర్చించనున్నారు. ఆరోగ్య సంరక్షణలో సంప్రదాయ వైద్య విధానాల పాత్రను ప్రజలకు వివరించనున్నారు.

ఏప్రిల్ 11న ఔషధ భద్రతపై దృష్టి సారిస్తూ డ్రగ్స్ నియంత్రణ బలోపేత కార్యక్రమాలు చేపట్టనున్నారు. మందుల వినియోగంలో జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించనున్నారు. గాంధీ ఆసుపత్రిలో డీ అడిక్షన్ చికిత్స శిబిరం నిర్వహించి మత్తు పదార్థాల నుంచి బయటపడే మార్గాలపై సలహాలు ఇవ్వనున్నారు. విద్యార్థుల కోసం వ్యాసరచన, ప్రశ్నోత్తర పోటీలు నిర్వహించి ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించనున్నారు.

ALSO READ: ఈ గుడిలో నూడుల్స్, పిజ్జాతో నైవేద్యం.. ఎక్కడో తెలుసా?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments