HomeCrimeబురఖాలో వచ్చిన మహిళ షాకింగ్ చోరీ

బురఖాలో వచ్చిన మహిళ షాకింగ్ చోరీ

రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే బంగారం ధర రూ.1.50 లక్షలను దాటి, త్వరలోనే రూ.2 లక్షల మార్క్‌ను తాకే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలతో పాటు బంగారంపై నేరాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ ఘటనలు, అర్ధరాత్రి జువెలరీ దుకాణాల్లో చోరీలు, ఆయుధాలతో బెదిరించి దోపిడీలు వంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఒక విచిత్ర దొంగతనం ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య జిల్లా రుదౌలీ పట్టణంలో ఉన్న అగర్వాల్ కాంప్లెక్స్ ప్రాంతం జువెలరీ దుకాణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బురఖా ధరించి సాధారణ కస్టమర్‌లా ఒక మహిళ జువెలరీ దుకాణంలోకి ప్రవేశించింది. దుకాణ యజమానితో సాధారణంగా మాట్లాడుతున్నట్లే ప్రవర్తించిన ఆమె, 26 గ్రాముల బంగారు హారం చూపించాలని కోరింది. యజమాని కూడా ఎలాంటి అనుమానం లేకుండా ఆ హారాన్ని బయటకు తీసి చూపించారు.

అయితే క్షణాల్లోనే పరిస్థితి మారిపోయింది. యజమాని చేతిలో ఉన్న హారాన్ని ఒక్కసారిగా లాగేసుకున్న ఆ మహిళ, వెంటనే అతను ప్రతిఘటించడానికి ప్రయత్నించగానే గన్ తీసి అతనిపై గురిపెట్టింది. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో బెదిరించడంతో యజమాని షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత ఎటువంటి ఆత్రుత లేకుండా ఆ మహిళ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం దుకాణంలోని కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రుదౌలీ పోలీసులు, నిందితురాలి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సంఘటనతో స్థానిక వ్యాపారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి నేరాలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తూ, జువెలరీ దుకాణాల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: వారి హయాంలో నాశనం.. మా హయాంలో శాసనం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments