HomeCrimeరీల్ చేసేందుకు నదిలోకి దిగి.. నలుగురు మిత్రులు మృతి!

రీల్ చేసేందుకు నదిలోకి దిగి.. నలుగురు మిత్రులు మృతి!

ఉత్తర ప్రదేశ్‌లో విషాదాన్ని మిగిల్చిన ఘటన సోషల్ మీడియా రీల్స్ మోజు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టంచేసింది. గోరఖ్‌పూర్ జిల్లాలోని రాప్తి నదిలో మీర్జాపూర్ ఘాట్ వద్ద ఐదుగురు బాలురు వీడియోలు చిత్రీకరిస్తూ నీటిలోకి దిగగా, నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన నలుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీయగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఏప్రిల్ 03 ఉదయం ముగ్గురు టీనేజర్ల మృతదేహాలు నదిలో తేలుతూ కనిపించడంతో పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మారింది.

ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. రాణిదిహా ప్రాంతానికి చెందిన అమన్ అలియాస్ బీరు 15, వివేక్ నిషాద్ 15, గగన్ పాశ్వాన్ 15, అనికేత్ యాదవ్ 13 మరియు వారి స్నేహితుడు రాజ్‌కరణ్ అలియాస్ టైమ్‌పాస్ కలిసి సైకిళ్లపై విన్యాసాలు చేస్తూ వీడియోలు తీసుకుంటూ మీర్జాపూర్ ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత నదిలో స్నానం చేస్తూ రీల్స్ తీయాలనే ఆలోచనతో అందరూ నీటిలోకి దిగారు. అయితే వారు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. నీటి ప్రవాహం, లోతు అంచనా వేయలేక నలుగురు బాలురు మునిగిపోగా, రాజ్‌కరణ్ మాత్రం ధైర్యంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు.

ఘటన తర్వాత వెంటనే రాజ్‌కరణ్ తన స్నేహితుల కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఘాట్ వద్ద పరిశీలనలు చేపట్టారు. అక్కడ నాలుగు సైకిళ్లు, పిల్లల బట్టలు, మొబైల్ ఫోన్లు లభించాయి. అనంతరం గాలింపు చర్యలు ప్రారంభించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. బుధవారం రాత్రి వరకు గాలింపు కొనసాగించినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు. గురువారం సాయంత్రం ఘటనాస్థలానికి సుమారు 100 మీటర్ల దూరంలో వివేక్ నిషాద్ మృతదేహం లభించింది. తర్వాత శుక్రవారం ఉదయం అమన్, గగన్, అనికేత్ మృతదేహాలు నదిలో తేలుతూ కనిపించడంతో మిగిలిన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

శుక్రవారం ఉదయం గజఈతగాళ్లు మూడు మృతదేహాలను బయటకు తీయగానే ఘాట్ పరిసరాలు విలపనలతో మార్మోగిపోయాయి. వందలాది గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు ఆర్తనాదాలు చేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. పోలీసులు నాలుగు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టకూడదనే అవగాహన అవసరం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది.

ALSO READ: సైకిల్‌గా మారే ఈవీ.. బ్యాటరీ అయిపోయినా ప్రయాణం ఆగదు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments